2, మార్చి 2012, శుక్రవారం

 జగన్ వెంట జనంలోకి....
 రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గడ్డు కాలం వచ్చి పడింది. కేంద్రం ఒత్తిడి మేరకు 17 మంది వైయెస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ ఏలపై అనర్హత వేటు పడింది. తద్వారా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ముఖ్య మంత్రికి, పిసిసి అధ్యక్షుడికి అగ్ని పరీక్ష పెట్టింది. ఢిల్లీ గల్లీల్లో గొప్పలు చెప్పుకుంటూ.. తిరుగుతున్న ఈ ఇద్దరు నాయకులకు రానున్న ఎన్నికలు లిట్మస్ పరీక్ష లాంటివే. తామేంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో జగన్ కు పెరుగుతున్న ప్రజాదరణకు అడ్డు కట్ట వేయడంలో ఈ ఇద్దరు విఫలమైనట్టు కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇప్పుడు ప్రత్యక్షంగా జగన్ ప్రజా బలంతో తలపడా ల్సిన పరిస్థితి సృష్టించి.. అధిష్టానం ఆటలాడుతోంది. తమకు ఇష్టం ఉన్నా లేకున్నా ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఎన్నికల బరిలోకి దిగక తప్పని వాతావరణాన్ని డిల్లీ పెద్దలు సృష్టించారు. నిన్న మొన్నటిదాకా జగన్ ను తిట్టిపోసిన శంకరరావు, డిఎల్ ఇప్పుడు మాటమార్చారు. ఉప ఎన్నికల్లో జగన్ గెలుపు ఖాయమని ఢ౦కా భజాయించి చెబుతున్నారు. మరికాస్త ముందుకెళ్ళి ఉపఎన్నికల తర్వాత రాష్ట్రంలో భారీ మార్పులు జరుగుతాయని కూడా వెల్లడిస్తున్నారు. టిడిపి మాత్రం ప్రాణ సంకటంలో పడింది. ఉప ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూస్తే ఇక పచ్చ జెండాకు పుట్టగతులుండవని ఆ పార్టీ నాయకులే బాహాటంగా చెబుతున్నారు. బాబు గారి నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లడం ఖాయమని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు భంగపడిన చంద్రబాబు ముచ్చటగా మూడోసారి కూడా చతికిల పడితే భవిష్యత్తేమిటనే బెంగ ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. అందరికన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఉత్సాహంగా కనిపిస్తున్నారు. వైఎస్సార్ వంటి దిగ్గజం లేకుండా పార్టీని ఒంటి చేత్తో నడిపించే సత్తా గల నాయకుడి ఆసరా లేకుoడా ... జగన్ వెంట... జనం మధ్యకు ధైర్యంగా వెళ్ళడం నిజంగా కొత్త అనుభూతే!  జగన్ కు అంతో ఇంతో ప్రజాబలం ఉందని అటు కాంగ్రెస్, ఇటు టిడిపి ఒప్పుకుంటూనే ఉన్నాయి. ఒంటరి పోరుకు సిద్ధపడిన జగన్ పార్టీ ఏకలవ్యుడిలా కనిపిస్తోంది. అధికార పక్షాన్ని.. ప్రతిపక్షాన్ని.., సిపిఐ., సిపిఎం వంటి తోక పార్టీలను ఎదుర్కుని వైఎస్సార్ కాంగ్రెస్ అజేయంగా నిలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తప్పవనే విషయం తేటతెల్లం అవుతుంది. ఉప ఎన్నికల తర్వాత కప్పదాట్లు.. గోడ దూకుళ్ళు కచ్చితంగా కనిపిస్తాయి. తాత్సారం చేసినా స్పీకర్ తగిన సమయమలోనే సరైన నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతోంది. ఒక దెబ్బకు రెండు పిట్టల్లా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలకు ఒకేసారి పరీక్ష పెట్టారు స్పీకర్. కడప  లోక్ సభ ఎన్నికల్లో జగన్ భారీ మెజార్టీతో గెలవడం ఒక ఎత్తైతే... ఆయన తన పార్టీ నాయకుల్ని గెలిపించుకోవడం మరో సవాల్. రాష్ట్ర మంతులు ఎందుకో ఉప ఎన్నికలపి అంతగా ఆసక్తి కనబరుస్తున్నట్టు లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరికీ మూడుతుందో... ఎవరి పదవి ఊడుతుందో అర్ధం కాకుండా ఉంది.  టిడిపి శిబిరంలోనూ ఇదే వాతావరణం కనబడుతోంది. ఓటమి భయంతో అసలు పోటికే నేతలు సిద్ధపడడం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్ ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్, టిడిపిలు ఏకమై పోరాడక తప్పదని నేతలు చెబుతున్నారు. ఇదే నిజమైతే వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
- శివరాం 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి