30, జనవరి 2012, సోమవారం

అరెస్ట్ ల వెనక అంతరార్థం ఏమిటి...?


త 60 ఏళ్ళ చరిత్రలో సిబిఐ ఇప్పుడు చూపుతున్న అత్యత్సాహం ఎప్పుడూ ప్రదర్శించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం సిబిఐ మన రాష్ట్రంలో మునుముందుకు దూసుకుపోతోంది. మంచిదే.. ఇదే ఉత్సాహం... ఇదే వేగం అన్ని సందర్భాల్లో కనబరిస్తే ప్రజలు  అంతకన్నా కోరుకునేదేముంటుంది. వేల కేసులు పెండింగ్ లో ఉన్నా... చేతకాదని చేతులెత్తేసిన సిబిఐ మన రాష్ట్రంలో మాత్రం రేసు గుర్రంలా పరుగులు తీస్తోంది. ఎమ్మార్ కేసులో ఇప్పటి వరకూ జరిపిన అర్రెస్ట్ లన్నీ ఒకఎత్తైతే... తాజాగా చేసిన బిపి ఆచార్య అరెస్ట్ మాత్రం ముందుగా ఊహించిందే..!  ఆయన ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్నారు. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ కేసును జగన్ మెడకు ఉచ్చులా బిగించి ఆయనను అప్రదిష్ట పాలు చేయడం లక్ష్యంగా సిబిఐ ముందుకు సాగుతున్నట్టు స్పష్టమవుతూనే ఉంది. ఇప్పటి వరకూ సిబిఐ అరెస్ట్ చేసిన వారందరూ జగన్ ప్రమేయాన్ని ప్రత్యక్ష్మగా కానీ.. పరోక్షంగా కానీ వెల్లడించిన దాఖలాలు లేవు. వారిలో కొందరినైనా  అప్రూవర్లుగా మార్చి జగన్ పేరు చెప్పించేందుకు సిబిఐ నానా తంటాలు పడుతోంది. రాఘవన్ ను అయితే పెద్ద వాడని కూడా చూడకుండా చెయ్యిచేసుకున్నట్టు స్వయంగా ఆయనే కోర్టుకు తెలిపారు.తాను ఆసుపత్రి పాలయ్యానని కూడా ఆయన విన్నవించారు. సిబిఐ ఇంతగా స్పందించాల్సిన అవసరం ఉందా..? అనే ప్రశ్నకు మౌనమే సమాధానంగా కనిపిస్తోంది. కేవలం పత్రికా వార్తల ఆధారంగా.. ఊహజనిత సమాచారంతో సిబిఐ కొన్ని సందర్భాల్లో అరెస్ట్ లకు తెగబడుతున్నట్టు జనం అనుమానించే పరిస్థితి ఏర్పడింది. అనుమానితులుగా భావించి అదుపులోకి తీసుకున్న వారితో తమకు కావాల్సిన సమాచారం రాబట్టడానికి నానా యాగీ చేస్తోంది. సిబిఐ విచారణకు తెరవెనక సూత్రధారిగా  టిడిపి మాజీ మంత్రి... సిబిఐ మాజీ ఉన్నతాధికారి ఒకరు ఉన్నారనే ప్రచారానికి ప్రస్తుత పరిణామాలు ఊతమిస్తున్నాయి. సిబిఐ విచారణ యావత్తూ... ఆ మాజీ కనుసన్నల్లోనే సాగుతున్నట్టు ఆరోపణలోచ్చినమాట వాస్తవం. ఆయనే లీకువీరుడనే ప్రచారం కూడా సాగుతోంది. ఏదిఏమైనా.. 2012  ఎన్నికలనాటికి  జగన్ బలహీన పడేలా చేసే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ పై ఉంచినమాట నిజం. ఇది సామాన్యుడికి కూడా అర్ధమైన సత్యం.ఎమ్మార్ ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే చంద్రబాబు నాయుడి పాలన నుంచి ఇప్పటివరకూ జరిగిన అన్ని పరిణామాలను పరిశీలించాలి. అవసరమైతే చంద్రబాబును కూడా విచారించాలి. అవకతవకలు ఎప్పుడు జరిగాయి... అక్రమాల వెనక అసలు హస్తం ఎవరిదీ... అనే అంశాలను నిగ్గు తెల్చాలంటే ఎమ్మార్ ఆస్తుల పుట్టుపూర్వోత్తరాలన్నింటినీ తవ్వి తోడటం ఒక్కటే మార్గం. జగన్ లక్ష్యంగా విచారణ సాగినంతకాలం జనం దృష్టిలో సిబిఐ పలచన కావడమే తప్ప ప్రయోజనం ఉండదు. కోట్లాది రూపాయలు దండుకుని దుబాయికి తరలించిన పెద్దమనుషులకు టిడిపి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. వారిని కాపాడే బాధ్యతను ఆ పార్టీ అధినేత నేత్తికేత్తుకున్నారు.లోపాయికారి ఒప్పందాలతో చంద్రబాబు నాయుడు తనవారిని వేనకేసుకోస్తున్నట్టు తెలుస్తూనేఉంది. ఇప్పటికైనా సిబిఐ స్వతంత్రంగా వ్యవహరించి ఎమ్మార్ ఆస్తుల కేసులో అసలు దోషులను కనుగొంటే ఆ సంస్థ నిజాయితీ వెల్లడవుతుంది. ఆదిశగా సిబిఐ తన పనితీరును మార్చుకుంటుందని ఆశిద్దాం...!
-శివరాం

25, జనవరి 2012, బుధవారం





సూర్యుడిని మనం ప్రత్యక్షభగవానునిగా పూజిస్తాము . సమస్త జీవులకు ప్రాణాధారమైన శక్తిని ప్రసాదిస్తున్న ఆరోగ్యప్రధాత శ్రీ సూర్యభగవానుడు . శ్రీసూర్య భగవానుని , దాదాపు ప్రతి ఆలయములో వున్న నవగ్రహాలలో ఉంచి పూజిస్తూ ఉన్నప్పటికీ , ఆయనకు విడిగా దేవాలయాలు కూడాన్నాయి . వాటిల్లో మనకు తెలిసినవి , "కోణార్క్ దేవాలయము " , " అరిసివిల్లి " లోని సూర్య దేవాలయము .. సికింద్రాబాద్ , తిరుమలగిరి క్రాసింగ్ దగ్గర సూర్య దేవాలయము ఉన్నది, సూర్య దేవాలయము విశాలమైన ప్రాంగణములో వుంది . లోపలి కి వెళ్ళగానే ఎదురుగా సూర్య దేవాలయము , గేట్ కు కుడివైపున సత్యనారాయణస్వామి ఆలయము వున్నాయి . చిన్న కొండను తొలిచి గర్భాలయముగా చేసారు . అందులో సూర్యభగవానుడు కొలువుతీరి వున్నాడు .సప్తాశ్వారూడుడైన స్వామివారు చతుర్భుజుడు . శంఖు , చక్రములు ధరించి రధము తోలుతూ స్వామివారు దర్శనము ఇస్తారు . స్వామివారు ఎంత కళగా వున్నారో చెప్పలేను చూసేందుకు రెండు కళ్ళూ చాలవనిపించింది . అరిసివెల్లి లోని స్వామివారి కంటే ఇక్కడి స్వామివారే చాలా కళగా వున్నట్లు నాకు అనిపించింది . స్వామివారిని వివిధ వ్యాధులతో బాధ పడుతూ వున్నవారు దర్శిస్తే బాధలు తొలుగుతాయట.ఆలయము ముందు వైపు పై భాగం లో సప్తాశ్వారూడుడైన సూర్య భగవానుని విగ్రహం దర్శనమిస్తుంది . సూర్యాలయము పక్కనే అశ్వత్ధవృక్షము వుంది . దాని కి కొంచం పక్కగా శివలింగమును స్తాపించారు . శివలింగము పక్కన సరస్వతి ఆలయము వుంది . అక్కడ సరస్వతి చేతిలో వీణను అలంకరించారు సరస్వతి ఆలయము పక్కనే నాగదేవత ఆలయము వుంది . ఇక్కడ నాగదోషాలు వున్నవారు అర్చిస్తే దోషాలు తొలుగుతాయి అంటారు . గేట్ దగ్గరగా వున్న సత్యనారాయణ స్వామి ఆలయములో వ్రతము చేసుకోవచ్చు. ఆలయాలన్నీ ప్రశాంతమైన వాతవరణములో వున్నాయి . ప్రతిరోజూ చేసే పూజలు కాక , ' రధసప్తమి ' రోజున , ' సంక్రాంతి ' రోజున ఆలయ ప్రాంగణములో హోమము చాలా బాగా చేస్తారట. అప్పుడు చాలా రష్ వుంటుదిటసుమారు యాభై సంవత్సరాల క్రితము ప్రాంతములో పోచయ్య అనే వ్యక్తి వుడేవాడు అతను వృత్తిరీత్యా ఎక్కువగా దూర్ప్రాంతాలకు వెళుతూవుండేవాడు .పోచయ్య ప్రతిరోజూ ఉదయము స్నానము చేయగానే సూర్య నమస్కారాలు చేస్తూ వుండేవాడు . ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా సూర్యుడికి నమస్కారాలు చేసుకొని వెళ్ళేవాడు . రాను రాను సూర్యభగవానుని పై నమ్మకము పెరిగి , సూర్యుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నాడు . ఒకసారిపనిమీద కలకత్తాకు వెళ్ళాడు . అక్కడ ఆయనకు సూర్యుని గురించి అనేక విషయాలు తెలుసుకొనే అవకాశము కలిగింది .అలా సూర్యుని గురించి తెలుసుకున్న ఆయనకు సూర్యుని మీద నమ్మకము ఇంకా పెరిగింది .కలకత్తా నుంచి తిరిగి వచ్చాక సూర్య దేవాలయము నిర్మించాలనుకున్న ఆయనకు , సోదరి తో పాటు మరికొందరు భక్తులు చేయూతను ఇచ్చారు . దీనితో ప్రస్తుతము ఆలయము వున్నప్రదేశము అనువైన ప్రాంతము గా గుర్తించారు . 1962 లొ అక్కడ చిన్న పాకను నిర్మించి అందులో స్వామిని ఉంచి , ప్రతిరోజూ ఉదయమూ , సాయంకాలమూ దీపము వెలిగించి పూజలు చేసేవారు . 1964 లో ఇప్పుడు వున్న ఆలయాన్ని నిర్మించి , శ్రీ సూర్య భగవానుడి తోపాటు ఇతర దేవతా మూర్తులను కూడా ప్రతిష్టించారు. దేవాలయము ఉదయము 7 గంటల నుంచి 11 వరకు , సాయం కాలము 5 నుంచి 7.30 వరకూ తెరిచి వుంటుంది . తప్పక చూడవలసిన ఆలయము .
-------------------------------------------------------------------------------------------------------
 చూడతగ్గ ఆలయం యాగంటి 

 క్కడి నుంచి " యాగంటి " చేరుకునే సరికి గుడి మూసివేసే సమయము అయ్యింది . అందుకని అక్కడే వున్న అన్నదాన సత్రము లో భోజనము చేసి 2 గంటలకు గుడి తలుపులు తీసేవరకు విశ్రాంతి తీసుకున్నాము . చుట్టూ కొండలు పెద్ద పెద్ద చెట్లతో అక్కడి ప్రదేశము చాలా బాగుంది . అగస్త్య మహాముని తన దక్షిణ దేశ యాత్రలో ప్రదేశములో కొన్ని రోజులు తపస్సు చేసారట . అప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టించతలిచి విగ్రహము తయారు చేయించారట . మరునాడు విగ్రహ ప్రతిష్ఠ అనగా విగ్రహము పాదమునకు బొటన వేలు లేదని గమనించారట . ఎలాగా అనుకుంటు వుండగా మహేశ్వరుడు అగస్త్యునికి కనిపించి , ఇది నాకు ఇష్టమైన ప్రదేశము , కాబట్టి ఇక్కడ నన్ను ప్రతిష్ఠించమని చెప్పాడట . అప్పుడు అగస్త్యుడు పార్వతి తో సహా వెలుస్తేనే ప్రతిష్ఠిస్తానని అంగా , ఉమాదేవి తో సహా ఈశ్వరుడు ఇక్కడ వెలిసాడు . ఇక్కడి శివలింగము మీద ఉమా మహేశ్వరుల వదనాలు వుంటాయి .అలా ఇంకే శివలింగము మీద వుండదుఇక్కడి నంది విగ్రహము పెరుగుతూ వుండటము ఇక్కడి ప్రత్యేకత .80/90 సంవత్సరాల క్రితము నంది చుట్టూ ప్రదక్షణలు చేసేందుకు వీలుగా వుండేదిట . ఇప్పుడు నాలుగు స్తంబాలకు ఆనుకొని ప్రదక్షణకు వీలుగాలేదు . కలియుగాంతమునకు నందీశ్వరుడు లేచి రంకె వేస్తాడని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞానము లో చెప్పారట . విగ్రహమును ఎక్కడో చేసి తెచ్చినట్లుగా లేదు . ఇక్కడే వెలిసినట్లు చిన్న పర్వతాకారములో వుంది . ఇక్కడ మూడు గుహలు ఉన్నాయి . ఒకటి అగస్త్యమహాముని తపస్సు చేసింది . ఇంకొకటి వెంకటేశ్వర స్వామిని వుంచింది .మూడవ దానిలో వీరబ్రహ్మేంద్రస్వామి కొంతకాలము కాలజ్ఞానము రాసారంటారు . ఇక్కడి కొలను లోని నీరు చాలా స్వచ్చం గా వుంటుంది . గుడి కి పైకి వెళ్ళేందుకు 60+ మెట్లు ఎక్కాలి ! అంతే కాదు ఇక్కడ తినేందుకు అరటిపళ్ళు కూడా కనిపించలేదు ! మంచినీళ్ళ బాటిల్స్ దగ్గర నుంచీ అన్నీ తీసుకొని వెళ్ళాలి . భోజన మంటే అక్కడి సత్రములోనే వుంది . మెట్లు ఎక్కాలి . ఇవన్ని చూసుకొని వెళితే చాల సుందరమైన ప్రదేశము "యాగంటి ".
-----------------------------------------------------------------------------------------------------------
వ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగంఅంటూ నవ్వుకు సరికొత్త నిర్వచనం చెప్పినజంధ్యాలపేరు వినగానే, ప్రతివారి పెదవులపై నవ్వు తొణికిసలాడుతుంది. ఆరోగ్యకరమైన హాస్యానికి చక్కని చిరునామా జంధ్యాల. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎక్కువ మంది ప్రతిభావంతులైన హాస్యనటులను అందించిన ఘనత కలిగిన దర్శకుడు జంధ్యాల. తెలుగు సినిమా రంగంలో హాస్య దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక ముద్రను సంపాదించుకున్న జంధ్యాల పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంలో 1951 జనవరి 14 జన్మించారు. జంధ్యాల నారాయణమూర్తి, సూర్యకాంతం వీరి తల్లిదండ్రులు. జంధ్యాల వెంకట దుర్గా శివసుబ్రహ్మణ్యశాస్ర్తీ అనేది ఈయన పూర్తి పేరు. విద్యాభ్యాసం మొత్తం విజయవాడలో కొనసాగింది. జంధ్యాల కాలేజి రోజులనుంచే నాటకాలు రాస్తూ, దర్శకత్వం వహించారు. స్వయంగా విన్నకోట రామన్నపంతులు ఆధ్వర్యంలో ఒక నాటక సంస్థ ప్రారంభించారు. మొదటి నాటకం ‘‘ఏక్ దిన్ కా సుల్తాన్’’ ఎంతో పేరుతెచ్చిపెట్టింది. తన నాటకాలే కాకుండా, ఇతరులు రాసిన నాటకాల్ని ప్రదర్శించి, ప్రముఖుల్ని సత్కరిస్తుండేవారు. జంధ్యాల రాష్టవ్య్రాప్తంగా అనేక నాటక పరిషత్తుల్లో పాల్గొని ఉత్తమ నటుడు, ఉత్తమ ప్రదర్శన అవార్డులు ఎన్నో పొందారు. సినీ రంగంపై మక్కువతో మిత్రులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో 1973లో మద్రాసులో అడుగుపెట్టారు. మొదటిసారిగా ‘‘పెళ్ళికాని పెళ్ళి’’ అనే సినిమాకు రచన చేసారు. అయితే ‘‘దేవుడుచేసిన బొమ్మలు’’ సినిమా ముందు రిలీజైంది. దాదాపు 140 సినిమాలకు రచయితగా పనిచేసారు. ఎక్కువ సినిమాలు హాస్యరస ప్రధానమైనవే. కె.విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు, .కోదండరామిరెడ్డి లాంటి ప్రముఖ దర్శకుల చిత్రాలకు రచనలు చేసారు. 1983లో ఏకంగా 80 సినిమాలకు మాటలు రాసారు. తెలుగు సినిమా చరిత్రలో ఇదొక రికార్డు. హాస్య చిత్రాలకు ఎంత చిలిపిగా రాసారో, ‘‘శంకరాభరణం’’లాంటి చిత్రాలకు అంత హృద్యంగా రాసారు. 1981లో ‘‘ముద్దమందారం’’ సినిమా ద్వారా దర్శకులుగా మారారు. ప్రదీప్, పూర్ణిమ హీరో హీరోయిన్లుగా చేసిన చిత్రం శత దినోత్సవం జరుపుకుంది. దర్శకులుగా 40 సినిమాలు రూపొందించారు. వీటిలో నాలుగు స్తంభాలాట, రెండుజెళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, ఆనందభైరవి, నెలవంక, రావుగోపాలరావు, శ్రీవారి శోభనం, రెండురెళ్ళఆరు, సీతారామకళ్యాణం, పడమటి సంధ్యారాగం, అహనాపెళ్ళంట, వివాహ భోజనంబు, చూపులు కలిసిన శుభవేళ, బావా బావా పన్నీరు, ప్రేమ ఎంత మధురం, బాబాయ్ హోటల్, ఓహో నా పెళ్ళంట లాంటి సినిమాలు విజయవంతమవడంతోపాటు దర్శకులుగా జంధ్యాలకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. నరేష్, రాజేంద్రప్రసాద్ లాంటి కామెడీ హీరోలతోనే కాకుండా ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయిన చిరంజీవి, బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు లాంటి అగ్ర హీరోలతో కూడిన తనదైన ముద్రలో చిత్రాలు రూపొందించడం ఒక్క జంధ్యాలకే సాధ్యమైంది. జంధ్యాల ఎందరో హాస్య నటుల్ని తెలుగు తెరకు పరిచయం చేసారు. బ్రహ్మానందం, వేలు, వీరభద్రరావు, గుండు హనుమంతరావు, శ్రీలక్ష్మి, కోట శ్రీనివాసరావులను సమర్థవంతమైన హాస్య కళాకారులుగా తీర్చిదిద్దారు. ‘‘నాలుగుస్తంభాలాట’’ సినిమాలో ‘‘సుత్తి’’ అనే పదాన్ని ప్రయోగించి, పదానికి ఎంతో ప్రాచుర్యం కల్పించారు. పదం ఇప్పటికీ జనసామాన్యంలో పదే పదే వినిపిస్తుంటుంది. అందులో నటించిన వేలు, వీరభద్రరావుసుత్తిజంటగా ఎంతో ప్రసిద్ధులయ్యారు. జంధ్యాల సినిమాల్లో ప్రత్యేక హాస్య పాత్రలు పోషించిన శ్రీలక్ష్మి హాస్య నటిగా తెలుగు తెరపై ఎంతోకాలం రాణించింది. ఎంతోమందిని పరిచయం చేసిన జంధ్యాల ‘‘ఆపద్బాంధవుడు’’ సినిమాలో నటించి, పాత్రకు ఎంతో వనె్నతెచ్చారు. జంధ్యాల సినిమాల్లో సున్నితమైన హాస్యం ఉంటుంది. అది సుతారంగా తాకి మనసును గిలిగింతలు పెడుతుంది. ఇలాంటి హాస్యాన్ని సృష్టించి, హాస్యబ్రహ్మ అయిన జంధ్యాల 2001 జూన్ 19 తెలుగు ప్రేక్షకుల్ని విచార సాగరంలో ముంచి అనంత లోకానికి వెళ్ళిపోయారు. వెనుకటి తరం హాస్య రచయితలు పింగళి నాగేంద్రరావు, చక్రపాణి, సముద్రాల వంటి వారి బాటలో నడిచి, హాస్యాన్ని తన ఆయుధంగా నమ్మి, ఆరోగ్యవంతమైన హాస్యాన్ని తన చిత్రాల్లో చూపించిన జంధ్యాల, తెలుగువారి పెదవులపై చిరస్థాయిగా ఉంటారు.