30, జనవరి 2012, సోమవారం

అరెస్ట్ ల వెనక అంతరార్థం ఏమిటి...?


త 60 ఏళ్ళ చరిత్రలో సిబిఐ ఇప్పుడు చూపుతున్న అత్యత్సాహం ఎప్పుడూ ప్రదర్శించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం సిబిఐ మన రాష్ట్రంలో మునుముందుకు దూసుకుపోతోంది. మంచిదే.. ఇదే ఉత్సాహం... ఇదే వేగం అన్ని సందర్భాల్లో కనబరిస్తే ప్రజలు  అంతకన్నా కోరుకునేదేముంటుంది. వేల కేసులు పెండింగ్ లో ఉన్నా... చేతకాదని చేతులెత్తేసిన సిబిఐ మన రాష్ట్రంలో మాత్రం రేసు గుర్రంలా పరుగులు తీస్తోంది. ఎమ్మార్ కేసులో ఇప్పటి వరకూ జరిపిన అర్రెస్ట్ లన్నీ ఒకఎత్తైతే... తాజాగా చేసిన బిపి ఆచార్య అరెస్ట్ మాత్రం ముందుగా ఊహించిందే..!  ఆయన ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్నారు. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ కేసును జగన్ మెడకు ఉచ్చులా బిగించి ఆయనను అప్రదిష్ట పాలు చేయడం లక్ష్యంగా సిబిఐ ముందుకు సాగుతున్నట్టు స్పష్టమవుతూనే ఉంది. ఇప్పటి వరకూ సిబిఐ అరెస్ట్ చేసిన వారందరూ జగన్ ప్రమేయాన్ని ప్రత్యక్ష్మగా కానీ.. పరోక్షంగా కానీ వెల్లడించిన దాఖలాలు లేవు. వారిలో కొందరినైనా  అప్రూవర్లుగా మార్చి జగన్ పేరు చెప్పించేందుకు సిబిఐ నానా తంటాలు పడుతోంది. రాఘవన్ ను అయితే పెద్ద వాడని కూడా చూడకుండా చెయ్యిచేసుకున్నట్టు స్వయంగా ఆయనే కోర్టుకు తెలిపారు.తాను ఆసుపత్రి పాలయ్యానని కూడా ఆయన విన్నవించారు. సిబిఐ ఇంతగా స్పందించాల్సిన అవసరం ఉందా..? అనే ప్రశ్నకు మౌనమే సమాధానంగా కనిపిస్తోంది. కేవలం పత్రికా వార్తల ఆధారంగా.. ఊహజనిత సమాచారంతో సిబిఐ కొన్ని సందర్భాల్లో అరెస్ట్ లకు తెగబడుతున్నట్టు జనం అనుమానించే పరిస్థితి ఏర్పడింది. అనుమానితులుగా భావించి అదుపులోకి తీసుకున్న వారితో తమకు కావాల్సిన సమాచారం రాబట్టడానికి నానా యాగీ చేస్తోంది. సిబిఐ విచారణకు తెరవెనక సూత్రధారిగా  టిడిపి మాజీ మంత్రి... సిబిఐ మాజీ ఉన్నతాధికారి ఒకరు ఉన్నారనే ప్రచారానికి ప్రస్తుత పరిణామాలు ఊతమిస్తున్నాయి. సిబిఐ విచారణ యావత్తూ... ఆ మాజీ కనుసన్నల్లోనే సాగుతున్నట్టు ఆరోపణలోచ్చినమాట వాస్తవం. ఆయనే లీకువీరుడనే ప్రచారం కూడా సాగుతోంది. ఏదిఏమైనా.. 2012  ఎన్నికలనాటికి  జగన్ బలహీన పడేలా చేసే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ పై ఉంచినమాట నిజం. ఇది సామాన్యుడికి కూడా అర్ధమైన సత్యం.ఎమ్మార్ ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే చంద్రబాబు నాయుడి పాలన నుంచి ఇప్పటివరకూ జరిగిన అన్ని పరిణామాలను పరిశీలించాలి. అవసరమైతే చంద్రబాబును కూడా విచారించాలి. అవకతవకలు ఎప్పుడు జరిగాయి... అక్రమాల వెనక అసలు హస్తం ఎవరిదీ... అనే అంశాలను నిగ్గు తెల్చాలంటే ఎమ్మార్ ఆస్తుల పుట్టుపూర్వోత్తరాలన్నింటినీ తవ్వి తోడటం ఒక్కటే మార్గం. జగన్ లక్ష్యంగా విచారణ సాగినంతకాలం జనం దృష్టిలో సిబిఐ పలచన కావడమే తప్ప ప్రయోజనం ఉండదు. కోట్లాది రూపాయలు దండుకుని దుబాయికి తరలించిన పెద్దమనుషులకు టిడిపి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. వారిని కాపాడే బాధ్యతను ఆ పార్టీ అధినేత నేత్తికేత్తుకున్నారు.లోపాయికారి ఒప్పందాలతో చంద్రబాబు నాయుడు తనవారిని వేనకేసుకోస్తున్నట్టు తెలుస్తూనేఉంది. ఇప్పటికైనా సిబిఐ స్వతంత్రంగా వ్యవహరించి ఎమ్మార్ ఆస్తుల కేసులో అసలు దోషులను కనుగొంటే ఆ సంస్థ నిజాయితీ వెల్లడవుతుంది. ఆదిశగా సిబిఐ తన పనితీరును మార్చుకుంటుందని ఆశిద్దాం...!
-శివరాం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి